గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల నడుమ కాంగ్రెస్ ఒకరిని మించి ఒకరు ఓట్ల రాజకీయాలకు తెరలేపాయి. మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు అన్న చందంగా తెలంగాణ రాజకీ యాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రధాన మంత్రి దిష్టి బొమ్మలను దహనం చేస్తుంటే కేంద్రంలో రాజ్యమేలుతున్న బిజెపి పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను పోటీపడి తగల బెడుతున్నాయి. ఈ రెండు పార్టీల గమ్మత్తు రాజీకీయాల నడుమ సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల దిష్టి బొమ్మలను కాల్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇదంతా ఇలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఉత్తుత్తి మీడియా వర్గం అదిగో పీకె టీం సర్వే..ఇదిగో కారుకు ఇన్ని సీట్లు…చేతికి అన్ని వేళ్లు …కమలానికి లెక్కలేనన్ని రెక్కలు అంటూ అదిగోపులి..ఇదిగో తోక అంటూ కల్పిత కథనాలను జనాల మీదికి విసురుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల గోల మొదలయిందనిపిస్తోంది. అదిగో వచ్చే ఎన్నికల్లో దూసుకుపోయేది కారే అని కొందరు..కాదు..కాదు కమలం వికసిస్తోందని మరికొందరు..లేదు..లేదు చేయి బలపడిరదంటూ ఇంకొందరు నానా రకాల ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. గతంలో చూడని మునుపెన్నడూ లేని రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పటి సహచరుడు ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడుతున్నారనే అనుమా నంతో ఈటలను కెసిఆర్ పార్టీనుంచి ప్రభుత్వం నుంచి గెంటి వేయడం తదనంతరం అనివార్య పరిస్థితుల్లో ఉప ఎన్నిక పరీక్షను ఎదుర్కోవడం దగ్గర నుంచి సిఎం కెసిఆర్ అనేక తొట్రుపాటు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కమలం వికాసానికి బీజం నాటినట్లుగా పలువురు అంటున్నారు. చిన్న సందు దొరికితే అల్లుకుపోయే తత్వం ఉన్న కమలనాథులకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బంపర్ బొనంజా అభ్యర్థిగా ఈటల దొరికారు. గెలుపో చావే అన్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ కాషాయ జెండాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎగిరించారు. ఇంకేముంది ఈటల గెలుపును తన బలుపుగా బెజిపి చక్కగా వినియోగించుకున్నది. రాష్ట్రం మొత్తం మీద బిజెపి గాలి వీస్తోందంటూ…అధికార టిఆర్ఎస్ని ఢీకొట్టేది తామేనంటూ ప్రచారాన్ని హోరెత్తించింది. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంలో కరీంనగర్ పోలీసులు వ్యవహరించిన తీరు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు డి.అరవింద్పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కేలా చేశాయి. దిష్టి బొమ్మల దహనాల సంస్కృతి మళ్లీ ముందుకొచ్చింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ రెండు పార్టీల నడుమ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడినట్టే అయింది. మేం మేం కొట్టుకుంటున్న ప్పుడు ఇద్దరిలో ఏవరో ఒకరం గెలుస్తాం అనే తరహాలో కాంగ్రెస్ని బిజెపి, టిఆర్ఎస్లు మూడో స్థానానికి నెట్టివేసే గమ్మత్తు ముందస్తు ప్రణాళికాబద్ద రాజకీయాలకు తెరలేపాయి. ఇలాంటి ప్రణాళిక టిఆర్ఎస్ చేస్తోందా లేక బిజెపి చేస్తోందా అనేది అంతు చిక్కని ప్రశ్నే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ బలపడటం ముమ్మాటికీ అధికార టిఆర్ఎస్కు ఇబ్బందికర పరిణామమే. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి వచ్చే సహజ వ్యతిరేకత గంపగుత్తగా ఒకేవైపు ..అదీ ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ వైపు మళ్ళితే అధికార పార్టీకి ఓటమి తప్పదు. సరిగ్గా ఇదే అంశం టిఆర్ఎస్ని ఇరుకున పెట్టడంతోనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును రకరకాల వైపు మళ్ళించాలనే ఎత్తుగడ వేసినట్లుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇందులో నిజా నిజాల సంగతి ఎట్లున్నా బిజెపి మాత్రం తనకు అధికార టిఆర్ఎస్ కల్పితంగా పుట్టిస్తున్న చిన్న సందును సక్రమంగా వినియోగించుకుంటూ కావాల్సినంత ప్రచారాన్ని అందుకోగలిగింది. తన బలమేంటే తన బలహీనతేంటే కమల నాథులకు బాగా తెలుసు. అధికార పార్టే తమకు సందు పుట్టిస్తోంటే వద్దంటుందా? పశ్చిమబెంగాల్ తరహా పరిస్థితులు అందివచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా ఉంటుందా? తనతో వచ్చే ఎన్నికల్లో తలపడే ప్రత్యర్థిని సిఎం కెసిఆర్ హస్తం కాకుండా కమలాన్ని ఎంచుకున్నారా? అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే బలమైన అభ్యర్థిని మైండ్ గేమ్ ద్వారా బరిలో నుంచే తప్పించడం ఓ ఎత్తుగడ. ఆ ఎత్తుగడ అటు ఇరుపార్టీల అవసరాల దృష్ట్యా అటు టిఆర్ఎస్ ఇటు బిజెపిలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాయనే పరిస్థితులు ఇప్పుడు దిష్టి బొమ్మల దహనాలను చూస్తే వచ్చిన అనుమానానికి బలం చేకూరుస్తోంది. గత కొద్ది రోజులుగా సిఎం కెసిఆర్ త్వరలో జైలుకు వెళుతున్నారని..ఇందుకోసం అదిగో కేంద్రంలో ఓ ఐపిఎస్ అధికారిని ఏర్పాటు చేశారని ..ఆయన కెసిఆర్ గోతులు తవ్వే పనిలోనే ఉన్నారని బిజెపి పదేపదే ప్రచారాన్ని నెత్తినెత్తుకున్నది. దీనికి అనుగుణంగా ఓ ప్రేరేపిత మీడియాలో కథనాలు వచ్చేలా చేస్తున్నారు. ఇదంతా బిజెపి నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ అనే చెప్పవచ్చు. తమ దగ్గర ఆధారాలున్న పక్షంలో అవన్నీ వెంటనే బయటపెట్టి ముందుకు పోవచ్చు. కానీ గత చాలా సంవత్సరాలుగా ఇదే మాటను బిజెపి నేతల నోటివెంట పదేపదే రావడం కేవలం ఊకదంపుడు వ్యవహారంగానే చూడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే రాజ్యాంగం మీద కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు చక్కగా ఉపయోగించుకుం టున్నారు. రోజూ కెసిఆర్ దిష్టి బొమ్మల దహనాలకు పాల్పడే అవకాశాన్ని కెసిఆర్ యాదృచ్చికంగా కల్పించారో లేక ఎత్తుగడలో భాగంగా అవకాశాన్ని సృష్టించారో అంతుచిక్కని వ్యవహారమే. ఇక ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో స్వాగతం చెప్పాల్సిన సిఎం కెసిఆర్ చివరి నిమిషంలో తప్పించారు. దీనికి అస్వస్తత అనే కారణం చూపెడుతున్నా బిజెపి నేతలు నానా యాగీ చేశారు. ప్రధానిని అవ మానించారంటూ కెసిఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇంతలోనే రాజ్యసభలో ప్రధాని విభజన చట్టం మీద చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేయడానికి తీరిక లేకుండా చేశాయి.మరోవైపు సింగరేణి ప్రైవేటీ కరణ అంటూ సింగరేణి బొగ్గు గనుల మీద ప్రధాని దిష్టి బొమ్మల దహనాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే గత నెలరోజులుగా రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలు దిష్టిబొమ్మల దహనాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
ప్రజాసమస్యలు గాలికి?
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని దౌర్భాగ్య రాజీకీయాలు చోటుచేసుకుంటు న్నాయి. ఓ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో స్వాగతం చెప్పాల్సిన సిఎం చివరి నిమిషంలో తప్పుకుంటారు.ఇదేంటంటే ఔను కావాలనే తమ ముఖ్యమంత్రి ప్రధాని పర్యటనను పట్టించుకోలేదు.. అయితే ఏంటి? అని ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఒకరు ప్రశ్నిస్తారు? ఇదంతా టిఆర్ఎస్ ఆడుతున్న విచిత్ర రాజకీయ ఎత్తుగడలో లేక ఆ పార్టీ చేస్తున్న పొరపాట్లో అర్థం కాని పరిస్థితి. ఇక ప్రధాని పర్యటనకు గైర్హాజరయిన సిఎం దిష్టి బొమ్మలను తగలబెట్టే పనికి బిజెపి పూనుకోవడం అందివచ్చిన పరిణామం. అనారోగ్యంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నట్లు సిఎం కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినప్పుడు బిజెపి నేతలు సిఎం దిష్టి బొమ్మలను దహనం చేయడం అనవసర, అత్యుత్సాహ చర్యనే. ప్రధాని పర్యటనకు సిఎం దూరమయినప్పుడు ఆ విషయాన్ని విమర్శల ద్వారా హుందాగా ఎండగట్టవచ్చు. అయితే పాతబడిన, ఓ అనవసర దుష్ట దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రల వ్యవహారాలను బిజెపి నేతలు ఎంచుకున్నారు. ఇంకేముంది దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని దిష్టిబొమ్మలను తగలబెట్టడం, శవయాత్రలు చేయడం అధికార పార్టీ టిఆర్ఎస్ ఎత్తు కునే అవకాశం ఇంకోవైపు నుంచి దక్కింది. ఓ వైపు కేంద్రంలో మరో వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం నివ్వెరపోయే అంశమే. రాష్ట్ర రాజకీయాలను పూర్తి స్థాయిలో దిగజార్చేవే. కేవలం ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ దివాళకోరు రాజకీయాలకు తెరలేపడంతో అసలు ప్రజాసమస్యలు కొద్దిరోజులుగా మరుగునపడి పోయాయి. ఇప్పటికీ రాష్ట్రంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అలాంటి సమస్యల పరిష్కార దిశగా ఆలోచించకుండా కేవలం దిష్టిబొమ్మల దహనాలతోనే సరిపెట్టుకుంటామనే ధోరణిలో ఇరుపక్షాలు వ్యవహరించడం సిగ్గు చేటు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పుడే ఈ స్థాయిలో హీన రాజకీయాలకు తెరలేస్తే రానున్న రోజుల్లో ఏ పరిస్థితి దాపురిస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్వయంగా ఎంఎల్ఎలు, ఎంపీలు, మంత్రులే దిష్టి బొమ్మలు తగలబెట్టడం, శవయాత్రలు చేయడం ఏంటి? ఇంతకన్నా దౌర్భాగ్య రాజకీయాలు మరొకటి ఉంటాయా? ఇదంతా ఓట్ల రాజకీయం కాక మరేంటని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం ఇరుపక్షాలు చెవికెక్కించుకుంటాయో లేదో చూడాలి.
మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు
RELATED ARTICLES